కలం, ఖమ్మం బ్యూరో: అటవీ జంతువులను వేటాడేందుకు అమర్చిన విద్యుత్ తీగలు ఒక అటవీ అధికారి ప్రాణాలను బలితీసుకున్నాయి. నకిరేపేట అటవీ ప్రాంత దుర్ఘటన (Nakirepet Forest Tragedy)లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ విద్యుత్ షాక్తో మృతి చెందగా, ఘటనకు కారణమైన నలుగురు నిందితులను బూర్గంపాడు పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. ఈ మేరకు శనివారం పాల్వంచ డీఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు.
ఈ నెల 11వ తేదీ రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నకిరేపేట అటవీ ప్రాంతంలో విద్యుత్ వైర్లతో అక్రమంగా వేట సాగిస్తున్నారనే సమాచారంతో FBO నవీన్, డీఆర్ఓ అనార్కలి, ఇతర సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుల కోసం వెతుకుతుండగా, వారు అమర్చిన విద్యుత్ తీగ తగలడంతో నవీన్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. డీఆర్ఓ అనార్కలి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం వేట ప్రారంభించారు.
లక్ష్మిపురం గ్రామంలోని ఆవుల నాగిరెడ్డి ఇంట్లో నిందితులు ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో దాడి చేసి ఆవుల నాగిరెడ్డి (44), దాసరి నరేష్ (35), తాటి వీరబాబు (28) లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద సేకరించిన సమాచారం ఆధారంగా నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో నాలుగో నిందితుడు కన్నెదారి అనంతయ్య (58) ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి బైండింగ్ వైరు, గడ్డపలుగు, ఖాళీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. అడవుల్లో విద్యుత్ తీగలు అమర్చడం అత్యంత ప్రమాదకరమని, ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

