కలం, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్ర పరిసర ప్రాంతాలలో వరుసగా ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను( Inter-State Bike Theft Gang) జిల్లా పోలీసులు (Adilabad Police) అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఈ నెల 6న ఇచ్చోడ మండల కేంద్రంలోని సుభాష్నగర్ కాలనీకి చెందిన ధరాడే బాలాజీ తన ఇంటి వద్ద పార్క్ చేసిన బైక్ చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు.
మారంపెళ్లి అనిల్, షేక్ షబ్బీర్, షేక్ ముస్తాషాహిద్, మహమ్మద్ జాకీర్, మహమ్మద్ షఫీలను అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ముఠాగా ఏర్పడి ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడినట్లుగా నిందితులు విచారణలో వెల్లడించినట్లు చెప్పారు. ఇచ్చోడ, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర పరిసర ప్రాంతాలలో ఇప్పటివరకు సుమారు 44 ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. చోరీ చేసిన బైక్లను కొనుగోలు చేసిన గుండాల, కేశవపట్నం గ్రామాలకు చెందిన ముజాహిద్, ఇక్బాల్, కరీంలను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు అఖిల్ మహాజన్ వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ముఠాకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

