కలం, నల్లగొండ: నల్లగొండ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (Nalgonda Govt Hospital) లో విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలో చేరి మగబిడ్డకు జన్మనిచ్చిన ఒక బాలింత అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య (Suicide) కు పాల్పడింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మునుగోడు (Munugodu) మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన మమత (27) అనే మహిళ ప్రసవం కోసం ఎనిమిది రోజుల క్రితం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది.
ఇదివరకే ఈమెకు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా, తాజాగా ఆసుపత్రిలో నాలుగో సంతానంగా మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, బుధవారం తెల్లవారుజామున మమత తను ఉన్న వార్డు నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చింది. ఆసుపత్రి ప్రాంగణంలోని పోస్టుమార్టం గది సమీపంలోకి వెళ్లి, తన చీరతో ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. ఉదయం గమనించిన ఆసుపత్రి సిబ్బంది, రోగుల బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు ఆడపిల్లల తర్వాత మగబిడ్డ పుట్టినా కూడా ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? మానసిక ఒత్తిడి ఏదైనా ఉందా? లేక కుటుంబ కలహాలు కారణమా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆరా తీస్తున్నారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఇలా అనంత లోకాలకు వెళ్లిపోవడంతో చీకటిమామిడి గ్రామంలోనూ, ఆసుపత్రి ప్రాంగణంలోనూ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

