కలం, దేవరకొండ : నల్లగొండ జిల్లా దేవరకొండ (Devarakonda) నియోజకవర్గంలో దారుణ ఘటన వెలుగుచూసింది. కొండమల్లేపల్లి (Kondamallepally) మండల కేంద్రంలో రూప అనే మహిళ దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఉదయానికల్లా ఆమె రక్తమడుగులో శవమై కనిపించడంతో గమనించిన స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న కొండమల్లేపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హత్యకు గల కారణాలపై తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలా లేక మరేదైనా కోణంలో ఈ హత్య జరిగిందా అనే దిశగా క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ల సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

