కలం, స్పోర్ట్స్ : కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో భారత ఫెన్సర్లు (Indian fencers) సత్తా చాటారు. పోటీల రెండో రోజు భారత్ ఏకంగా ఏడు పతకాలు సాధించింది. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. సీనియర్ మహిళల ఎపీ విభాగంలో తనిష్కా ఖత్రి స్వర్ణ పతకం సాధించగా.. ఖుషీ దభాడే రజతం, ప్రాచి లోహన్ కాంస్య పతకం గెలిచారు. మహిళల సేబర్ విభాగంలోనూ భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. ఆఖరి రజతం సాధించగా, జెఫర్లిన్, శ్రుతి జోషి కాంస్య పతకాలు అందుకున్నారు.
సీనియర్ పురుషుల ఫాయిల్ విభాగంలో తేజస్ పాటిల్ కాంస్య పతకం సాధించాడు. ఈ విభాగంలో సైప్రస్కు చెందిన అలెక్స్ టోఫాలిడాస్ స్వర్ణం, ఇంగ్లండ్కు చెందిన ఆలివర్ స్టారాంజ్ రజతం గెలుచుకున్నారు. భారత ఫెన్సింగ్ జట్టు విజయాలలో కోచింగ్, సపోర్ట్ స్టాఫ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కోచ్లు భరత్జీ థాకోర్, శ్రీహరి పిసే, శంకర్ నారాయణన్తో పాటు ఫిజియోథెరపిస్ట్ అమృతా బాల్కవాడే, టీమ్ మేనేజర్ మను త్యాగి జట్టుకు సహకరిస్తున్నారు. కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ ఆగస్టు 14 వరకు కొనసాగనుంది. మిగిలిన పోటీల్లోనూ మరిన్ని పతకాలు సాధించడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగనుంది.

