కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం (Congress PAC Meeting) మంగళవారం నిర్వహించారు. నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల ఇన్చార్జీలు, పీఏసీ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియపై బూత్ ఏజెంట్లకు అవగాహన కల్పించడం, ఓట్ల తొలగింపు అంశంపై అప్రమత్తంగా ఉండటం, జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు కోసం కృషి చేయడం వంటి అంశాలపై చర్చించారు.
ఇకపై ప్రతి 45 రోజులకు ఒకసారి పీఏసీ సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. పార్టీ పదవులు, మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల కమిటీల నియామకాలలో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించారు. పార్టీ కోసం కష్టపడిన సీనియర్ నాయకులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించే అంశంపై కూడా తీర్మానం చేశారు. అదేవిధంగా జిల్లా అధికారుల తీరుపై, పోడు భూములు, ఆర్ఓఎఫ్ఆర్ సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించాలని నిర్ణయించారు. బూత్, మండల కమిటీలను మరింత బలోపేతం చేయడంతో పాటు జిల్లా కేంద్రంలో రాజీవ్గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాల ఏర్పాటుకు కృషి చేయాలని తీర్మానించారు.ఈ సమావేశంలో నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు, మాజీ మంత్రులు వేణుగోపాల్ చారి, ఇంద్రకరణ్ రెడ్డి, పీఏసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

