కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతీరాంపూర్ మైసమ్మ తల్లి బోనాల వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ (Gangula Kamalakar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే గంగులకు కాలనీవాసులు ఘన స్వాగతం పలికారు.
భక్తులు ఆయనకు నుదుటిన తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, శాలువాతో సత్కరించారు. అనంతరం గంగుల అమ్మవారి బోనం ఎత్తుకొని, మొక్కులు చెల్లించారు. శివశక్తుల పూనకాల మధ్య సాగిన ఈ వేడుకలు భక్తిశ్రద్ధలతో కోలాహలంగా సాగాయి. అమ్మవారి పూనకం వచ్చిన మహిళా భక్తురాలు శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మించాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. వచ్చే దసరా పండుగ నాటికి నూతన ఆలయాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, దురిశెట్టి అనూప్ కుమార్ పాల్గొన్నారు. వీరితోపాటు బీఆర్ఎస్ నాయకులు మిడిదొడ్డి నవీన్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, జీపీ స్వామి, స్థానిక కాలనీవాసులు ఎల్లయ్య, బాల్ రెడ్డి, శేఖర్, సుధాకర్, మల్లయ్య, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

