కలం, వెబ్ డెస్క్ : పంజాగుట్ట (Panjagutta) స్మశాన వాటికలో దారుణం చోటు చేసుకుంది. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయమైంది. చార్మినార్ ప్రాంతానికి చెందిన దంపతులకు ఇద్దరు కవలలు జన్మించగా వారు అనారోగ్యం పాలయ్యారు. ఒకరి పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోవడంతో పసికందును పంజాగుట్ట స్మశానవాటికలో ఖననం చేశారు.
అయితే, మరుసటి రోజు మరో శిశువు కూడా మరణించడంతో ఒకే చోట ఇద్దరినీ పూడ్చిపెట్టేందుకు స్మశాన వాటికకు వెళ్లిన తల్లిదండ్రులకు షాకింగ్ ఘటన కనిపించింది. ముందు రోజు శిశువును ఖననం చేసిన చోట గుంత కనిపించింది. అందులో పసికందు మృతదేహం మాయం కావడంతో ఒక్కసారిగా ఆందోళన చెందారు.
దీంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ శిశువు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కాటికాపరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

