కలం, వెబ్ డెస్క్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Saurav Ganguly)ని చంపేస్తామంటూ ఆయన నివాసానికి బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపింది. మొదట ఒక లేఖ రాగా గంగూలీ కుటుంబం పెద్దగా పట్టించుకోలేదు. వెంటనే మరొకటి కొరియర్ రావడంతో గంగూలీ మేనేజర్ కోల్కతాలోని ఠాకుర్పుర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గంగూలీ భార్య డోనా, కుమార్తె, కుటుంబ సభ్యులను హతమార్చుతామని లేఖలో బెదిరించారు.
లేఖలు రాసిన వ్యక్తి గుర్తింపు..
గంగూలీ నివాసానికి బెదిరింపు లేఖలు వచ్చిన కొరియర్ గురించి ఆరా తీయగా.. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బెల్ఘరియాకు చెందిన వ్యక్తి పంపించినట్లుగా గుర్తించారు. అతను ఎందుకు ఈ లేఖలు రాశాడు, మొబైల్ నెంబర్, అతడి కదలికలపై ఆరా తీస్తున్నారు. గతంలో కూడా గంగూలీకి బెదిరింపులు రాగా.. అవి కూడా ఇతనే చేశాడా.. లేకపోతే మరెవరైనా అని దర్యాప్తు చేస్తున్నారు. గంగూలీకి ప్రాణ హాని ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో ఎప్పటి నుంచో ఆయనకు పోలీస్ భద్రత కల్పిస్తున్నారు.

