కరీంనగర్‌లో గ్యాంగ్‌వార్ కలకలం.. కార్పొరేటర్ సహా 7 మంది అరెస్ట్!

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ లొల్లి ఆందోళన కలిగిస్తోంది. కరీంనగర్‌లో గ్యాంగ్ వార్ కలకలం రేపుతోంది. స్థానిక బీజేపీ కార్పొరేటర్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌కు చెందిన గుగులోతు శ్రీకాంత్ (28) అనే యువకుడు తన సోదరుడు శేఖర్‌తో కలిసి ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో స్థానిక ఓపెన్ జిమ్ ప్రాంతంలో ఉన్నాడు.

​ఆ సమయంలో స్థానిక కార్పొరేటర్ అనుచరులైన భానుచందర్, మధు, చింటూ, నాగేందర్, రాజు, మరియు మరొకరు మద్యం (బీరు) తాగుతూ అక్కడికి వచ్చారు. వారు కత్తులతో శ్రీకాంత్, ఆయన సోదరుడిపై దాడి చేయడానికి ప్రయత్నించగా, వారు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అయితే, దాడి చేసిన ఆరుగురు నిందితులు శ్రీకాంత్‌ను చుట్టుముట్టి బీరు సీసాతో కడుపు భాగంలో పొడవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

గాయపడిన శ్రీకాంత్‌ను అతని సోదరుడు శేఖర్, స్నేహితులు, స్థానికులు కలిసి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, రెండో ఠాణా సీఐ సృజన్‌రెడ్డిలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితుడితో మాట్లాడి వివరాలు సేకరించారు. స్థానిక కార్పొరేటర్‌తో శ్రీకాంత్‌కు పాతకక్షలు ఉన్నాయని, ఆ కక్షల వల్లే తన అనుచరులతో ఈ దాడి చేయించారని శ్రీకాంత్ భార్య పూజశ్రీ, సోదరుడు శేఖర్‌లు ఆసుపత్రి వద్ద మీడియాతో తెలిపారు. నిందితులను త్వరలోనే గుర్తించి, వారిని అదుపులోకి తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు టౌన్ ఏసీపీ వెంకటస్వామి వివరించారు.

స్టేషన్ పరిధిలోని కిసాన్‌నగర్‌లో జరిగిన ఘర్షణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో A-1గా సోమిడి వేణు ప్రసాద్, వయస్సు 40 సంవత్సరాలు, కిసాన్‌నగర్, కరీంనగర్ — 29వ డివిజన్ కార్పొరేటర్ ను అరెస్ట్ చేయగా.. A-2 కుడిది నాగేందర్ @ నాగేంద్ర బాబు (వయస్సు 31 సంవత్సరాలు, బొమ్మకల్, కరీంనగర్) అదుపులోకి తీసుకున్నారు. A-3 పంతంగి మధు @ మధుకర్ (వయస్సు 29 సంవత్సరాలు, కిసాన్‌నగర్, కరీంనగర్), A-4 నెరెళ్ల నాగరాజు @ రాజు (వయస్సు 32 సంవత్సరాలు, కిసాన్‌నగర్, కరీంనగర్), A-5 శ్రీరామోజు భానుచందర్ @ భాను (వయస్సు 30 సంవత్సరాలు, కిసాన్‌నగర్, కరీంనగర్), A-6 సంగం వేణు @ చరణ్( వయస్సు 19 సంవత్సరాలు, కిసాన్‌నగర్, కరీంనగర్), A-7 పంతంగి శశిధర్ @ చింటూ ( వయస్సు 28 సంవత్సరాలు, కిసాన్‌నగర్, కరీంనగర్) ను పట్టుకున్నారు.

నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి దర్యాప్తు అనంతరం నిందితులను చట్ట ప్రకారం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ వెంకటరమణ తెలిపారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ వెంకటరమణ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>