కలం, స్పోర్ట్స్: రెండేళ్ల నిరీక్షణకు తెరపడింది. సర్ఫరాజ్ ఖాన్కు (Sarfaraz Khan) మళ్లీ టీమిండియా తలుపు తెరుచుకుంది. సాయి సుదర్శన్ గాయం కారణంగా ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్కు సర్ఫరాజ్ ఎంపికయ్యాడు. ఈ అవకాశం కోసం సర్ఫరాజ్ తీవ్రంగా శ్రమించాడు. గత ఏడాదిన్నరలో 17 కిలోల బరువు తగ్గాడు. తన ఫిట్నెస్ను మెరుగుపరుచుకున్నాడు. టీ20ల్లోనూ తన ఆటను మరింత పదును పెట్టాడు. ముంబైలో వర్షాల కారణంగా సాధనకు ఇబ్బందులు రావడంతో కశ్మీర్కు వెళ్లి ప్రాక్టీస్ చేశాడు. నెట్ బౌలర్లతో పాటు రాష్ట్ర జట్టు ఆటగాళ్లను ఎదుర్కొన్నాడు.
కుర్లాలోని ప్రైవేట్ సదుపాయాల్లో ఎర్రమట్టి పిచ్లపై స్పిన్ను ఎదుర్కొనేలా గంటల తరబడి సాధన చేశాడు. 2024లో న్యూజిలాండ్తో నాలుగు ఇన్నింగ్స్ల్లో విఫలమైన తర్వాత సర్ఫరాజ్ను జట్టు నుంచి తప్పించారు. ఆ తర్వాత ఇంగ్లండ్ లయన్స్పై భారత్-ఎ తరఫున 92 పరుగులు చేశాడు. ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్లో సెంచరీ కూడా సాధించాడు. అయినా జాతీయ జట్టులోకి రావడానికి సమయం పట్టింది. ఇప్పుడు సాయి సుదర్శన్ గాయం అతడికి ఛాన్స్ ఇచ్చింది.
రుతురాజ్ గైక్వాడ్, షేక్ రషీద్ పేర్లు పరిశీలనలో ఉన్నా.. స్పిన్ను బాగా ఆడగల సర్ఫరాజ్ వైపే సెలెక్టర్లు మొగ్గుచూపారు. శ్రీలంకకు వచ్చిన ధ్రువ్ జురెల్ కూడా రెండు ‘ఎ’ టెస్టుల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేశాడు. కానీ స్పిన్పై అతడి ఇబ్బందులు మరోసారి కనిపించాయి. దీంతో సర్ఫరాజ్కు బ్యాటర్గా అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గాలేలో ఆగస్టు 15న తొలి టెస్టు మొదలవుతుంది. ప్రబాత్ జయసూర్య నేతృత్వంలోని శ్రీలంక స్పిన్ దాడిని సర్ఫరాజ్ ఎలా ఎదుర్కొంటాడన్నది ఆసక్తికరంగా మారింది.

