కలం, ఖమ్మం బ్యూరో: కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ ఇండియా స్ఫూర్తితో ప్రజా సంఘాలు కదంతొక్కాయి. సోమవారం ఖమ్మంలోని (Khammam) చర్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ‘జైల్భరో’ కార్యక్రమం హోరెత్తింది. ముందుగా నిర్వహించిన భారీ ధర్నాలో నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులు, శ్రమజీవుల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని విమర్శించారు.
ఆన్లైన్ ఎరువుల విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని, వీబీ – జీరామ్ (VB G RAM G) ను రద్దు చేసి ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి 100 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎడమ, కుడి కాలువలకు మరమ్మతులు చేసి సాగునీరందించాలన్నారు. భద్రాచలం-వెంకటాపురం రహదారి నిర్మించాలని, నిత్యావసరాలు, ఇంధన ధరలు తగ్గించడంతోపాటు ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక, ఐద్వా, గిరిజన సంఘాల నాయకులు రాధాకుమారి, చంటి, రామారావు, విజయశీల, నాగవర్మ, బాలాజీ పాల్గొన్నారు.
Also Read : హీరో యశ్ కోసం ఆ రూల్ను బ్రేక్ చేసిన నయనతార
Follow Us On : WhatsApp

