కలం, స్పోర్ట్స్ : టీమిండియా ఆటగాళ్ల గాయాల లొల్లి రోజురోజుకూ ముదురుతోంది. కీలక శ్రీలంక టెస్టు సిరీస్కు ముందే ఆటగాళ్ల ఫిట్నెస్పై పెద్ద రచ్చే నడుస్తోంది. ఈ వేడి వాతావరణంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఆదివారం బెంగళూరులోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (సీఓఈ) కి చేరుకుని హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) తో అత్యవసరంగా సమావేశమయ్యారు.
ఆగస్టు 15న సిరీస్ మొదలవుతుండగా జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్లు గాయాల బారిన పడ్డారు. దీంతో సీఓఈ వైద్య బృందం, సెలెక్టర్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై వీవీఎస్ లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. సీఓఈ అంటే కేవలం ఆటగాళ్ల గాయాలకు చికిత్స చేసే దావఖానా కాదని ఘాటుగా సమాధానమిచ్చారు. ఆటగాళ్లను అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లడమే తమ అసలు లక్ష్యమని స్పష్టం చేశారు.
క్రీడల్లో గాయాలనేవి అతి సాధారణ విషయమని లక్ష్మణ్ తేల్చి చెప్పారు. గాయాలు కాగానే మేనేజ్మెంట్పై నిందలు వేయడం, బలిపశువులను వెతకడం ఆపాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. సిరీస్ మధ్యలో యో-యో టెస్ట్ పెట్టడం సాధ్యం కాదు కాబట్టే, ‘బ్రోంకో టెస్ట్’ ద్వారా ఆటగాళ్ల ఫిట్నెస్ను నిమిష నిమిషం గమనిస్తున్నామని లక్ష్మణ్ తెలిపారు.
బుమ్రా మోకాలి నొప్పి, సుదర్శన్ కాలి వేలి నొప్పి తగ్గకపోవడంతోనే వారిని పక్కన పెట్టామని చెప్పారు. పూర్తి స్థాయిలో కోలుకున్నాకే ప్లేయర్లకు క్లియరెన్స్ ఇస్తామని, టీమ్ మేనేజ్మెంట్తో తమకు ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు. రాబోయేది సుదీర్ఘమైన టెస్టు సీజన్ కాబట్టి తొందరపడి ఆటగాళ్ల కెరీర్తో ఆడుకోలేమని లక్ష్మణ్ స్పష్టం చేశారు. విమర్శలు ఎలా ఉన్నా, ఆటగాళ్ల భవిష్యత్తే తమకు ముఖ్యమని లక్ష్మణ్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

