కలం, వెబ్డెస్క్: జాతీయత, ఐక్యతే భారత్ అసలైన బలమని ఏపీ డిప్యూటీ సీం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. నేడు క్విట్ ఇండియా ఉద్యమం (Quit India Movement) ప్రారంభమైన రోజు సందర్భంగా పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసుకున్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో క్విట్ ఇండియా ఓ కీలక మలుపుగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. 1942లో ఇదే రోజున మహాత్మా గాంధీ ఇచ్చిన “డూ ఆర్ డై” పిలుపు దేశవ్యాప్తంగా ప్రజల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిందన్నారు. గ్రామాలు, పట్టణాలనే తేడా లేకుండా లక్షలాది మంది భారతీయులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. గుర్తింపు పొందిన, గుర్తింపు పొందని ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు భయాన్ని వీడి దేశ స్వాతంత్య్ర కోసం తమ ప్రాణాలను, సర్వస్వాన్ని త్యాగం చేశారని వెల్లడించారు.
క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్మరించుకుంటూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను దేశం గుర్తుచేసుకుంటోందని పవన్ పేర్కొన్నారు. ఆ యోధుల పోరాటం, త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

