కలం, స్పోర్ట్స్ : భారత యువ ఆర్చర్ సాహిల్ జాదవ్ (Sahil Jadhav) క్రికెట్ స్ఫూర్తితో ఆర్చరీలో రాణిస్తూ అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధిస్తున్నాడు. మానసిక బలాన్ని పెంచుకోవడం కోసం ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ షాన్ వాట్సన్ రచించిన “ది విన్నర్స్ మైండ్సెట్” (The Winners Mindset) పుస్తకాన్ని చదివిన సాహిల్.. అందులోని మైండ్ టెక్నిక్స్ ద్వారా ఒత్తిడిని జయించడం నేర్చుకున్నాడు.
మహారాష్ట్రలోని సతారాకు చెందిన 25 ఏళ్ల సాహిల్ జాదవ్, కుటుంబ సభ్యుల త్యాగాలు, ప్రోత్సాహంతో 19 ఏళ్ల వయసులో ఆర్చరీ రంగంలోకి అడుగుపెట్టాడు. ఏడేళ్ల పాటు కఠిన శ్రమ చేసిన అనంతరం 2024 సీనియర్ నేషనల్స్లో స్వర్ణ పతకం సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు. తర్వాత కోచ్ ప్రవీణ్ సావంత్ మార్గదర్శకత్వంలో తన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకున్న సాహిల్.. 2025 వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లో స్వర్ణ, రజత పతకాలను సాధించాడు. 2026 షాంఘై ఆర్చరీ వరల్డ్ కప్లో కాంస్య పతకం గెలుచుకుని భారత్కు ఏకైక పతక విజేతగా నిలిచాడు.
ప్రస్తుతం 2026 ఆసియా గేమ్స్కు సన్నద్ధమవుతున్న సాహిల్.. కోల్కతాలోని సాయ్ సెంటర్లో కఠోర సాధన చేస్తున్నాడు. జపాన్లోని ఐచి-నాగోయా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలలో కొరియా, చైనా వంటి బలమైన జట్లకు సవాల్ విసరాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. క్రికెట్ నుంచి నేర్చుకున్న మానసిక దృఢత్వాన్ని ఆర్చరీలో ఉపయోగిస్తూ ముందుకు సాగుతున్న సాహిల్ జాదవ్.. ఆసియా గేమ్స్లో భారత్కు మరో పతకం అందిస్తాడనే ఆసక్తి నెలకొంది.

