కలం, ఖమ్మం బ్యూరో: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం జిల్లా ఏన్కూర్ (Enkoor) మండలంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన (Teachers Protest) తెలిపారు. మూలపోచారం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి డీఎస్. నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న డీఏలు, ఇతర బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. హెల్త్ కార్డుల అమలు, గురుకులాలు, కేజీబీవీలు, గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలని అన్నారు. అలాగే పండిట్, పీఈటీ పోస్టుల అప్గ్రేడేషన్, టీఆర్టీ ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జీవో 25ను సవరించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు బి. రామ్చంద్, మూడ్ పుల్లయ్య, హెచ్ఎం జి. నాగరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

