కలం, స్పోర్ట్స్ : 15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై (Vaibhav Sooryavanshi) భారత మాజీ ఆటగాడు అజింక్య రహానే (Ajinkya Rahane) కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడి ప్రతిభను గుర్తిస్తూ, అంతర్జాతీయ క్రికెట్లో రాణించేందుకు వైభవ్కు తగినంత సమయం ఇవ్వాలని సూచించాడు. దేశం తరఫున ఆడేటప్పుడు ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుందని రహానే పేర్కొన్నాడు. యువ ఆటగాడు తన సహజ ఆటను కొనసాగిస్తూ, అనుభవంతో క్రమంగా ఎదగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే వైభవ్పై ఎక్కువగా చర్చ జరుగుతోందని, అతడిపై అదనపు ఒత్తిడి పెంచకుండా ప్రోత్సహించాలని తెలిపాడు.
ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్ సూర్యవంశీ తొలిసారి భారత జట్టులో చోటు సంపాదించాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపికైన అతడు.. ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మూడు మ్యాచ్ల్లో 14, 13, 15 పరుగులు మాత్రమే చేయడంతో చివరి మ్యాచ్కు అవకాశం దక్కలేదు. అయితే ఆ తర్వాత జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో వైభవ్ తన సత్తా చాటాడు.
తొలి మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన అతడు, రెండో మ్యాచ్లో 20 పరుగులు సాధించాడు. మూడో టీ20లో 49 బంతుల్లో 81 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. జింబాబ్వేతో సిరీస్లో మొత్తం 151 పరుగులు చేసిన వైభవ్ 50.33 సగటుతో ఆకట్టుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. భారత్ ఈ సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ మధ్య ఒత్తిడి స్థాయిలో చాలా తేడా ఉంటుందని రహానే పేర్కొన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతూ అనుభవం పెరిగే కొద్దీ వైభవ్ మరింత మెరుగైన ఆటగాడిగా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ ప్రయాణం క్రికెట్ అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

