కలం, వెబ్ డెస్క్ : జంతర్ మంతర్ నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో విద్యార్థుల నిరసనకు సంబంధించిన పిటిషన్ విచారణ భాగంగా బుధవారం కేంద్రప్రభుత్వానికి న్యాయస్థానం పలు కీలక సూచనలు చేసింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విద్యార్థులు నిరసనల సందర్భంలో ప్రభుత్వ అధికారులు సంయమనం పాటించాలని సూచించింది.
“బలమైన రాజ్యం పేరుతో చేసే దురాక్రమణ” ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని కేంద్రాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. బలప్రయోగం కంటే యువ నిరసనకారులతో సంప్రదింపులు జరపడం, వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, వారి మాటలు వినడం వంటివి మరింత ప్రభావవంతంగా ఉంటాయని స్పష్టం చేసింది. నేరపూరిత చర్యలను సమర్థించకూడని చెబుతూనే.. అదే సమయంలో పోలీసుల మితిమీరిన చర్యలకు కూడా అంతే స్థాయిలో జవాబుదారీతనం ఉండాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

