కలం, జోగులాంబ గద్వాల : కేటిదొడ్డి (Ketidoddi Accident) మండలం నందిన్నె గ్రామ శివారులో రాయచూర్ రహదారిపై హైడ్రో క్లోరైడ్ ట్యాంకర్ మంగళవారం బోల్తాపడింది. కర్నూల్ నుంచి ముంబాయి కి రాయచూర్ మీదుగా వెళ్తున్న కేఎ16 డి 3209 నంబర్ గల హెచ్ సి ఎల్ ట్యాంకర్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది. ట్యాంకర్ నుండి యాసిడ్ లీకై పొగలు వ్యాపిస్తున్న నేపథ్యంలో వాహనదారులు, ప్రజలు శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉందని కేటిదొట్టి పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు.
ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, డ్రైవర్ నిద్రమత్తువలే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయలయ్యాయి. కర్నూల్ కు చెందిన ఓ కెమికల్ కంపెనీకి చెందిన ట్యాంకర్ గా గుర్తించారు. కర్నూల్ నుంచి మరో టెక్నీషియన్ ను రప్పించి ట్యాంకర్ ను హెచ్ సిఎల్ ను షిప్టింగ్ చేశారు. ఈ ప్రమాదంపై కేటిదొడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.

