కలం, జోగులాంబ గద్వాల : కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉరకలేస్తున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలకు వరద ప్రవాహం కొనసాగుతుండగా, కృష్ణమ్మ బిరాబిరా అంటూ శ్రీశైలానికి తరలివెళ్తుంది. మంగళవారం సాయంత్రానికి ఆల్మట్టి, తుంగభద్ర, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. అక్కడి నుంచి వరదను కృష్ణానదిలో విడుదల చేస్తున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టు(Jurala Project) కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
మంగళవారం సాయంత్రానికి జూరాలకు వరద ప్రవాహం 2.41 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. కర్ణాటక జలాశయాల నుంచి జూరాలకు 2,41,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా అధికారులు జూరాల డ్యాం 33 గేట్లను ఎత్తి 2,21,331 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. విద్యుదుత్పత్తికి 26,817 క్యూసెక్కులు, కుడి,ఎడమ, సమాంతర కాలువలతో పాటు ఎత్తిపోతలకు నీటిని విడుదల చేస్తుండగా.. మొత్తం 2,53,102 క్యూసెక్కుల అవుట్ఫ్లోగా నమోదైంది. డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం 9.657టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.701 టీఎంసీల నిల్వలు ఉన్నట్లు జూరాల ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

