కలం యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట ( Yadagirigutta) పట్టణంలోని జెడ్పిఎచ్ఎస్ ప్రభుత్వ బాలికల పాఠశాలను డీఈవో బిక్షపతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మధ్యాహ్నం భోజనం వండుతున్న తీరును, పాఠశాలల పరిసరాలు, పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యం, చదువు అత్యంత ప్రాధాన్యమైనవని అన్నారు. అదేవిధంగా పాఠశాల వసతులు, భోజనం నాణ్యత విషయంలో ఎలాంటి వ్యత్యాసం రావొద్దని ఆదేశించారు.
పాఠశాలలో వసతులు, విద్యార్థుల ఆహార మెనూ, వంట గదిని పరిశీలించారు. రోజువారి మెనూ ను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల నుంచి భోజన నాణ్యతపై ఫీడ్బ్యాక్ తీసుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ఉపాధ్యాయుల హాజరును పరిశీలించి ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని తెలిపారు. ఇక నుంచి పైఅధికారుల నిరంతరం ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, ఏదైనా లోపం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమం లో ఎంఈవో శరత్ యామిని, బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

