కలం, నిర్మల్: లక్ష్మణచాంద మండలం రాచపూర్ (Rachapur) గ్రామంలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల (బాలురు)కు శాశ్వత భవనం నిర్మించి, అందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను (Ponnam Prabhakar) కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు కోరారు. ఈ మేరకు మంత్రికి వినతిపత్రం అందజేసిన ఆయన, బీసీ గురుకుల పాఠశాల, కళాశాలకు ప్రభుత్వం గతంలోనే అనుమతి ఇచ్చినా ఇప్పటివరకు సొంత భవనం నిర్మాణం ప్రారంభం కాలేదని తెలిపారు. దీంతో విద్యార్థులు అద్దె భవనాలలో విద్యాభ్యాసం కొనసాగిస్తూ పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి 5 ఎకరాల 3 గుంటల భూమిని కొనుగోలు చేసి, 2011లో విద్యాశాఖ పేరుతో రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ ఇప్పటివరకు భవన నిర్మాణం చేపట్టలేదని ఆయన వివరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాచపూర్ బీసీ గురుకుల పాఠశాల, కళాశాలకు శాశ్వత భవనం నిర్మించేందుకు అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేసి పనులు ప్రారంభించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరారు.

