కలం, వెబ్డెస్క్: కూటమి ప్రభుత్వ నేతలకు ప్రధాని మోదీని పొగడటంలో ఉన్న శ్రద్ధ ఏపీలోని ముంపు ప్రాంతాలపై లేదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు. భారీ వర్షాలతో ఏపీలో నెలకొన్న పరిస్థితులపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి మోదీని గొప్పోడు, మొనగాడు అని భజన చేయడంలో ఉన్న శ్రద్ధ నీట మునిగిన ప్రజలను ఒడ్డుకు చేర్చడంలో లేదన్నారు.
రాష్ట్రంలో ఒక వైపు ఊర్లు మునుగుతుంటే తక్షణమే ప్రజలకు పునరావాసం కల్పించాలన్న సోయి కూడా ప్రభుత్వానికి లేదన్నారు. గోదావరి ఉగ్రరూపం దాల్చి 100 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారని షర్మిల తెలిపారు. 20 వేల మందికి పైగా వరదనీటిలో సర్వం కోల్పోయి నిర్వాసితులుగా మారుతున్నారని చెప్పారు. బాధితులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
మరోవైపు మోదీ(PM Modi)ని ఢిల్లీలో జెన్ జీ యువత తిడుతుంటే తన కళ్ల వెంట నీళ్లు వచ్చాయన్న పవన్ కల్యాణ్కు షర్మిల (YS Sharmila) కౌంటర్ ఇచ్చారు. మోదీని తిట్టినప్పుడు కన్నీళ్లు వస్తే నిర్వాసితుల గోస చూసి గుండె తరుక్కుపోవడం లేదా? అని ప్రశ్నించారు. వరద బాధితుల గోడు వినపడటం లేదా? అని నిలదీశారు. ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులై తట్ట, బుట్ట సర్దుకుని గ్రామాలు ఖాళీ చేస్తున్న దృశ్యాలు పవన్కు కనిపించలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపు గ్రామాలని తెలిసి స్థానికులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని ఇప్పటికే ఎందుకు ఇవ్వలేదు? అని షర్మిల ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే వరద బాధితులను ఆదుకోవాలని, వారికి పునరావాసం కల్పించాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
Also Read : భోగాపురం ఎయిర్పోర్టుపై గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

