కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల జిల్లా ధర్మపురి (Dharmapuri) నియోజకవర్గం గోదావరి పక్కనే ఉన్నప్పటికీ గత ప్రభుత్వ కాలంలో రైతులకు అవసరమైన సాగునీటి పనులను పట్టించుకోలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) ఆరోపించారు. శనివారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంభం పల్లి గ్రామంలోని చెరువును మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ధర్మపురి నియోజకవర్గంలోని రైతుల అవసరాలకు ఉపయోగపడే సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని అన్నారు. నియోజకవర్గంలో కీలకమైన రోళ్ళ వాగు ప్రాజెక్టుపై అంచనాలు పెంచి ప్రాజెక్టు పూర్తి చేయకుండా వదిలేశారని అన్నారు. అక్కపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కాగితాలకే పరిమితం అయ్యాయని మంత్రి ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా రోళ్ళ వాగు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తున్నామని, అక్కపల్లి లిఫ్ట్ పనులు పూర్తి చేసి 2027 జనవరి 27వ తేదీ వరకు నీటిని ఎత్తిపోస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
స్తంభంపల్లి లిఫ్ట్ పనులు పూర్తి చేయడంతో పాటు స్థంభంపల్లి చెరువు మత్తడి మరమ్మత్తు, తుముల వెడల్పు మరమ్మతుకు రూ. 5 లక్షలు కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. గొల్లపల్లి మండలంలోని యశ్వంతరావుపేట చెరువు పూడికతీత పనులు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. మేడారం రిజర్వాయర్ నుండి ముంజంపల్లి, మారేడుపల్లి గ్రామాలకు సాగునీటిని అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి (Adluri Laxman) అన్నారు. బొమ్మరెడ్డిపల్లి కొత్తపల్లి వరకు కాల్వ పనులు పూర్తి చేస్తామని నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి వివరించారు.
Also Read : కాళేశ్వరం మూడేళ్లకే కుంగింది.. మంత్రుల విమర్శలు
Follow Us On: Instagram

