కలం, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రాబోయే సీజన్ ముంగిట ట్రేడింగ్ మార్కెట్లో సంచలనం నమోదైంది. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఒకేసారి రెండు వేర్వేరు జట్ల నుంచి ఇద్దరు కీలక ఆటగాళ్లను తమ జట్టులోకి తెచ్చుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. ముంబై ఇండియన్స్ నుంచి స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ను, అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి యువ హిట్టర్ అశుతోష్ శర్మ (Ashutosh Sharma)ను చెన్నై దక్కించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ భారీ డీల్కు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని, పేపర్ వర్క్ తుది దశకు చేరుకుందని తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా జట్టులోకి వస్తుండటంతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ విషయంలో ఎలాంటి మార్పులు జరుగుతాయనేది ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఈ ట్రేడింగ్లో భాగంగా ముంబై ఇండియన్స్కు శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్లను చెన్నై సూపర్ కింగ్స్ అప్పగించినట్లు సమాచారం. రూ.10 కోట్ల శాలరీ క్యాప్ చొప్పున ఈ ఆటగాళ్ల మార్పిడి జరిగినట్లు టాక్. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అశుతోష్ శర్మను దక్కించుకోవడం కోసం ప్రశాంత్ వీర్ను చెన్నై వదులుకుంది. ఈ డీల్ విలువ రూ.6.5 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదట అశుతోష్ శర్మ స్థానంలో రాహుల్ చాహర్ పేరు వినిపించినప్పటికీ, చివరికి ప్రశాంత్ వీర్ వైపే మొగ్గు చూపారు. ఈ భారీ ట్రేడింగ్తో ఐపీఎల్ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి.

