కలం, మెదక్ బ్యూరో: రాష్ట్రంలో కొనసాగుతున్న వాతావరణ మార్పులు, భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికల నేపథ్యంలో వచ్చే వారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సంగారెడ్డి జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ (Sangareddy Collector) ప్రతీక్ జైన్ (Prateek Jain) ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని లోతట్టు ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన చోట పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని సూచించారు.
గ్రామాలు, పట్టణాలలో శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాత ప్రభుత్వ భవనాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. గ్రామాల వారీగా పూర్తి సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, కాలువలలో నీటి ప్రవాహాన్ని ఇరిగేషన్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కాజ్వేలపై నీరు ప్రవహిస్తున్న ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, ప్రజలు ఆ మార్గాలలో వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన ప్రాంతాలలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

