కలం, జోగులాంబ గద్వాల: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) వరద నీటి ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం సమయానికి ఎగువ నుంచి 1.22లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు 24 గేట్లను ఎత్తి దిగువకు 96,144 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. రెండు రోజులుగా జూరాలకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో ప్రాజెక్టు అధికారులు గేట్ల ద్వారా దిగువకు నీటిని వదులుతున్నారు. ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలతో పాటు భీమా నది వరద ఉద్ధృతికి కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది.
ఎత్తిపోతల పథకాలకు నీరు విడుదల..
జూరాల (Jurala Project) జలాశయంలో 317.77 మీటర్ల మేర 8.164 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతున్నారు. అదే సమయంలో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 750 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-1కు 1300 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ 630 క్యూసెక్కులు విడుదల చేస్తుండటంతో పాటు జూరాల కుడి, ఎడమ కాలువలతో పాటు సమాంతర కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్కు ఎగువ ప్రాంతం నుంచి 1.10లక్షల క్యూసెక్కుల వరద వస్తుంటే.. దిగువకు 1.05 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు.
Also Read : తెలంగాణలో సర్ ప్రక్రియ పొడిగింపు
Follow Us On: Instagram

