కలం, నిర్మల్: మైనర్లతో రాగి తీగలను చోరీ చేయిస్తూ, వాటిని స్క్రాప్గా కొనుగోలు చేసి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నాడు ఓ స్క్రాప్ దుకాణ యజమాని. భైంసా పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. సీఐ ప్రవీణ్ కుమార్ వివరాల ప్రకారం.. భైంసా (Bhainsa) పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం ఎదురుగా షేక్ నజీర్ స్క్రాప్ దుకాణం నిర్వహిస్తున్నాడు. మైనర్లతో వరుసగా రాగి తీగల చోరీలు చేయిస్తున్నాడు. ఇటీవల శివాజీ చౌరస్తాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం నుంచి రాగి తీగలు చోరీకి గురికావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు చోరీ వెనుక స్క్రాప్ దుకాణ యజమాని పాత్రను గుర్తించారు.
మైనర్లతో చోరీ చేయించి దొంగిలించిన రాగి తీగలను స్క్రాప్గా కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు ఆధారాలు లభించాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా షేక్ నజీర్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చోరీకి పాల్పడిన మైనర్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రాగి తీగలను స్వాధీనం చేసుకున్నారు. మైనర్లను నేరాలకు ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

