కలం, స్పోర్ట్స్ : కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) 2026లో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మంగళవారం జరిగిన క్వాలిఫైయింగ్ రౌండ్లలో స్విమ్మర్ శ్రీహరి నటరాజ్, అథ్లెట్ విశాల్ టీకే సెమీఫైనల్కు దూసుకెళ్లారు. అయితే మరో ప్రముఖ స్విమ్మర్ సాజన్ ప్రకాష్, అథ్లెట్ రాజేష్ రమేష్ పోటీల నుంచి నిష్క్రమించారు. పురుషుల 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఈవెంట్లో శ్రీహరి నటరాజ్ అద్భుతంగా రాణించారు. హీట్స్లో ఐదో స్థానంలో, ఓవరాల్గా 13వ స్థానంలో నిలిచి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నారు. ఆయన 55.58 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నారు.
మరోవైపు 400 మీటర్ల పరుగుపందెంలో విశాల్ టీకే సత్తా చాటారు. ఎనిమిదో హీట్లో పాల్గొన్న ఆయన 46.49 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ఓవరాల్గా 14వ వేగవంతమైన రేసర్గా సెమీఫైనల్కు అర్హత సాధించారు. అయితే స్విమ్మింగ్ 50 మీటర్ల బటర్ఫ్లై ఈవెంట్లో సాజన్ ప్రకాష్ నిరాశపరిచారు. తొమ్మిదో హీట్లో ఎనిమిదో స్థానంలో, మొత్తం 70 మందిలో 28వ స్థానంలో నిలిచారు.
ఆయన 24.94 సెకన్ల సమయం తీసుకుని సెమీస్ అవకాశాన్ని కోల్పోయారు. సోమవారం జరిగిన 200 మీటర్ల బటర్ఫ్లై ఫైనల్లో కూడా ఆయన ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. అలాగే 400 మీటర్ల రేసులో రాజేష్ రమేష్ ప్రయాణం ముగిసింది. మూడో హీట్లో 47.43 సెకన్లతో మూడో స్థానంలో నిలిచినప్పటికీ, సెమీఫైనల్కు అర్హత సాధించే సమయం నమోదు చేయలేకపోయారు.

