కలం, హనుమకొండ : కాజీపేట రైల్వే డివిజన్ సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని, ప్రజల హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ నిరంతరం ఉద్యమిస్తుందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar) అన్నారు. ఈ నెల 30న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాలో పాల్గొనేందుకు బయలుదేరిన పార్టీ శ్రేణులకు మంగళవారం ఉదయం కాజీపేట రైల్వే స్టేషన్లో ఆయన సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన మాదిరిగానే ఇప్పుడు తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం కూడా ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే భారత రాష్ట్ర సమితి ఉద్యమాలు చేపడుతోందని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల నాలుగు దశాబ్దాల కోచ్ ఫ్యాక్టరీ కలను బీఆర్ఎస్ ప్రభుత్వం సాకారం చేసిందని గుర్తు చేశారు. కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే కాజీపేట రైల్వే డివిజన్ (Kazipet Railway Division) ఏర్పాటు, కోచ్ ఫ్యాక్టరీ కోసం భూములు కోల్పోయిన భూ బాధితులకు ఉద్యోగ అవకాశాలు, లోకో పైలట్ల సమస్యల పరిష్కారం, రైల్వేకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం జంతర్మంతర్ వద్ద శాంతియుత ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణకు రావాల్సిన రైల్వే ప్రాజెక్టులు, హక్కులను సాధించేందుకు ఉద్యమమే మార్గమని పేర్కొన్న దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar), కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సంకు నర్సింగరావు, బొంగు అశోక్ యాదవ్, జోరిక రమేష్, సీనియర్ నాయకులు నార్లగిరి రమేష్, ఐనవోలు సర్పంచ్ రఘువంశీ, పులి రజినీకాంత్, పులి విక్రమ్, దువ్వ కనకరాజు, కోండ్ర శంకర్, గబ్బెట శ్రీనివాస్, సుంచు అశోక్, సుధాకర్, అఫ్జల్, పున్నం చందర్, బరిగెల వినయ్, కిట్టు, నయీం జుబేర్, లడ్డు, గణేష్, రాబర్ట్, సదానందం తదితరులు పాల్గొన్నారు.
Read Also: మలేషియా గోల్ఫ్ టోర్నీలో మెరిసిన గుంతాస్..
Follow Us On : WhatsApp

