కలం, వనపర్తి: ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కేనని, అర్హులైన ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేయించుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) పిలుపునిచ్చారు. పట్టణంలో కొనసాగుతున్న ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను సోమవారం విస్తృతంగా పరిశీలించిన ఆయన, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పలుస రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో బూత్ల వారీగా పర్యటించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో బీఎల్ఓల, బీఎల్ఏలు, బీఆర్ఎస్ శ్రేణులు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి ఓటరు పేరు తుది జాబితాలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. పట్టణంలో నమోదైన 63,246 ఓటర్లలో సుమారు 20 వేల మంది ఓట్లు గ్రామాలకు మారే అవకాశం ఉన్నందున, మిగిలిన వాస్తవ ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తిచేసి వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని కోరారు.
పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ చేపట్టి వనపర్తిని ఆదర్శ పట్టణంగా నిలపాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రతి బూత్లో చురుకుగా పనిచేస్తున్న బీఎల్ఓలు, బీఎల్ఏలు, బీఆర్ఎస్ కార్యకర్తలను అభినందించి సన్మానించారు. అనంతరం కౌన్సిలర్ భారతి–ప్రేమ్నాథ్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో పాల్గొని పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు పలుస రమేష్ గౌడ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

