కలం, సూర్యాపేట : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పొరులు మరోసారి రచ్చకెక్కాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ (MLA Mandula Samuel), రోడ్ల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన నియోజకవర్గంపై కోమటిరెడ్డి సోదరుల ఆధిపత్యాన్ని సహించేది లేదని ఆయన తెగేసి చెప్పారు.
నా నియోజకవర్గ సమస్యలు, రోడ్ల పనుల నిమిత్తం రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఎన్నోసార్లు కలిశాను. కానీ, ఆయన నా వినతులను, ఆదేశాలను కనీసం పట్టించుకోలేదని సామేల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనను గెలిపించింది ఏ ఒక్క నాయకుడో కాదని, కాంగ్రెస్ పార్టీ జెండా, నియోజకవర్గ ప్రజలే అని ఆయన స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడం నా చేతిలోనో.. రాజగోపాల్ రెడ్డి చేతిలోనో ఉండదనే చెప్పారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించినందుకు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తీవ్రంగా బాధపడుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను గెలుస్తానని నాడు రాజగోపాల్ రెడ్డి చెప్పారు.. కానీ, అప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తక్షణమే తన తుంగతుర్తి నియోజకవర్గ వ్యవహారాలలో కల్పించుకోవడం ఆపేయాలని సామేల్ హెచ్చరించారు.

