కలం, వనపర్తి: ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణలో పోలీసులకు ఆయుధాల వినియోగంపై సంపూర్ణ నైపుణ్యం ఎంతో అవసరమని జిల్లా ఎస్పీ (Wanaparthy SP) సునీత రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా ఎర్రవల్లి (Erravalli) 10వ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ ఫైరింగ్ రేంజ్లో నిర్వహించిన రెండు రోజుల వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ఎస్పీ సునీత రెడ్డి స్వయంగా అదనపు ఎస్పీ, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఫైరింగ్లో పాల్గొని ఆయుధ వినియోగ నైపుణ్యాన్ని పరిశీలించారు. విధుల్లో వినియోగించే ఆయుధాలతో ప్రతి అధికారి, సిబ్బందికి పది రౌండ్ల ఫైరింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ప్రతి పోలీసు తన వద్ద ఉన్న ఆయుధాల పనితీరు, వినియోగ విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, వాటిని ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని ఎస్పీ సూచించారు. శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వహించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత, కుటుంబ లేదా ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిబ్బందికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతి పోలీసు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, రిజర్వ్ ఎస్ఐ వినోద్, జిల్లా పోలీసు అధికారులు, ఎస్ఐలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

