కలం, కరీంనగర్ బ్యూరో : రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లాలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన వంశీ అనే యువకుడు బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మరణానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీయే కారణమంటూ అతను ఒక ఎస్ఐఆర్ ఫామ్పై రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది.
తన చావుకు కేవలం ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే కారణమని, ఈ విషయంలో వేరే ఎవరినీ ఏమీ అనవద్దని వంశీ ఆ లేఖలో స్పష్టం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, తదుపరి పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. యువకుడి ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

