కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) సబ్ డివిజన్ పరిధిలోని కరకగూడెం పోలీసుల ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల్లో శనివారం ‘కమ్యూనిటీ కనెక్ట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన రాబిన్ హుడ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నీలాద్రిపేట, గండి, అశ్వాపురంపాడు, గుత్తికోయ గ్రామాల్లోని గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు, చీరలు, సోలార్ విద్యుత్ లైట్లు, మహిళా అవసర వస్తువులను పంపిణీ చేశారు.
పోలీస్ శాఖ తరఫున సహకారం..
ఈ సందర్భంగా ఏడుళ్ల బయ్యారం సీఐ వి.వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పి.వి.ఎన్. రావు, రాబిన్ హుడ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి భూసారపు రమేష్ గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి పోలీస్ శాఖ తరఫున సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
దురలవాట్లకు దూరంగా ఉండాలి..
గిరిజన గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని సీఐ వి.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మద్యపానం, ఇతర దురలవాట్లకు దూరంగా ఉండాలని, పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలకు పంపించి వారి చదువుకు సహకరించాలని అవగాహన కల్పించారు. గ్రామాల్లో శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

