కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ బీసీ కమిషన్ (Telangana BC Commission) కార్యాలయంలో శాశ్వత ప్రాతిపదికన సిబ్బందిని నియమించాలని కమిషన్ నిర్ణయించింది. ఖైరతాబాద్లోని కమిషన్ కార్యాలయంలో శనివారం ఛైర్మన్ జి.నిరంజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం వివిధ శాఖల నుంచి డిప్యుటేషన్పై వచ్చిన ఉద్యోగులతో కమిషన్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, కమిషన్ విధివిధానాలు, బీసీ కులాలపై సమగ్ర అవగాహన కలిగిన శాశ్వత సిబ్బంది ఉంటే పనితీరు మరింత సమర్థవంతంగా ఉంటుందని కమిషన్ అభిప్రాయపడింది.
ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించింది. సమావేశంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో రిజర్వేషన్ల ఉల్లంఘన జరుగుతోందన్న ఫిర్యాదుపై బోర్డు సమర్పించిన నివేదికను కమిషన్ పరిశీలించింది. అలాగే అనాథలను గుర్తించేందుకు వయోపరిమితి పెంపు, ‘సాతాని’ పదం తొలగింపు అంశాలపై ఇటీవల నిర్వహించిన విచారణ నివేదికపై కూడా విస్తృతంగా చర్చించింది. సమావేశంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు, మెంబర్ సెక్రటరీ బి. బాల మాయ దేవి, ఐఏఎస్ పాల్గొన్నారు. ప్రత్యేక అధికారి కుమారి ఎన్. సునీత, సెక్షన్ ఆఫీసర్ జి. సతీష్ కుమార్, రీసెర్చ్ ఆఫీసర్ జి. లక్ష్మీనారాయణ తదితర అధికారులు హాజరయ్యారు.

