కలం, నిర్మల్: ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి జీవదాతలుగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు (Kuchadi Srihari Rao) అన్నారు. సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ ఆది జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్వర్ణ గ్రామంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూచాడి శ్రీహరి రావు మాట్లాడుతూ.. ఒక వ్యక్తి చేసే రక్తదానం పలువురి ప్రాణాలను కాపాడగలుగుతుందని అన్నారు.
యువత సామాజిక బాధ్యతతో తరచూ రక్తదాన శిబిరాల్లో పాల్గొని అవసరమైన వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, యువకులు మొత్తం 50 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదాతలను నిర్వాహకులు అభినందించి, వారి సేవాభావాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్థులు, యువకులు పాల్గొన్నారు.

