కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ జిల్లా బొల్లికుంట (Bollikunta)లో ఉద్రిక్తత నెలకొంది. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తరలించడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరికి మద్దతుగా హిందూ సంఘాల నేతలు, బీజేపీ నాయకులు గ్రామానికి చేరుకుంటున్నారు. ఘటన స్థలానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ (Ganta Ravikumar) చేరుకొని గ్రామస్తులకు మద్దతు పలికారు. ఛత్రపతి విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తరలించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య వాగ్వివాదం జరిగింది. గ్రామస్తులు బీజేపీ నాయకులు ఎంతకీ వెన్నక్కి తగ్గకపోవడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.

