కలం, మెదక్ బ్యూరో: మహిళల అక్రమ రవాణా (Human Trafficking) చేసి వ్యభిచారంలోకి బలవంతంగా దింపితే వారిపై కట్టని కఠిన చర్యలు తీసుకుంటామని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ (DSP Narender) హెచ్చరించారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివునూర్ సరోజినీ నగర్ లో శుక్రవారం పోలీసులు (Medak Police) కమ్యూనిటీ కనెక్ట్ నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ముగ్గురు సీఐలు, 14 మంది ఎస్ఐలు, వంద మంది పోలీస్ సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు.. ప్రతి ఇంట్లో ఆధార్ కార్డుల వివరాలను సేకరించారు.
పడుపు వృత్తి కోసం వైజాగ్, నల్గొండ, కామారెడ్డి నుండి వచ్చిన సుమారు 15 మంది మహిళలను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. సరైన ధృవపత్రాలు లేని మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వ్యభిచారం వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించారు. వ్యభిచారాన్ని మానివేయాలని ప్రభుత్వం తరఫున ఉపాధి కల్పించేందుకు సహకరిస్తామని డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు.

