కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఒంటరి మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ నుంచి ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లను (New Pensions) పంపిణీ చేయనున్నట్లు మంత్రి సీతక్క (Seethakka) వెల్లడించారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా నూతన పెన్షన్ల మంజూరుపై ఈ మేరకు మంత్రి ప్రకటన చేశారు. అర్హుత కలిగిన పింఛన్ దారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని.. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా అందరికీ పింఛన్లు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం పెన్షన్ పొందుతూ మరణించిన వారి పేర్లను తక్షణమే జాబితా నుండి తొలగించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు. అర్హత ఉండి కూడా లబ్ధి పొందని వారిని గుర్తించి, పథకాన్ని వర్తింపజేయాలన్నారు. అనర్హులు పింఛన్లు పొందడం వల్ల నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని.. అక్రమ పెన్షన్లను అరికట్టి అర్హులకే పెన్షన్ మంజూరు చేయాలని సూచించారు.

