కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem) భద్రాచలం (Bhadrachalam) నియోజకవర్గ పరిధిలోని చర్ల మండలంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టు గేట్లను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు (Tellam Venkat Rao) అధికారికంగా ఎత్తి దిగువ ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి లభ్యతను పరిశీలించిన అనంతరం, పరిసర ప్రాంత రైతుల ప్రయోజనాలను, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చర్ల దుమ్ముగూడెం మండలాల పరిధిలోని రైతులకు సకాలంలో సాగునీరు అందేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

