కలం, వెబ్ డెస్క్: ఆసియా అండర్-19, అండర్-23 బాక్సింగ్ చాంపియన్షిప్ (Boxing Championships) లో భారత యువ బాక్సర్లు మెరిశారు. జకార్తాలో జరిగిన పోటీల్లో పురుషుల విభాగంలో భారత్ రెండు స్వర్ణాలు, మూడు రజత పతకాలతో ప్రచారాన్ని ముగించింది. అండర్-23 విభాగంలో విశ్వనాథ్ సురేశ్ అదరగొట్టాడు. 50 కేజీల ఫైనల్లో జపాన్ బాక్సర్ డైచి ఇవాయిని 3-2తో ఓడించి స్వర్ణం గెలిచాడు. 55 కేజీల విభాగంలో గంగా కూడా బంగారు పతకం సాధించాడు. కజకిస్థాన్కు చెందిన బెక్సులాతన్ బోరాన్బెక్పై 3-2తో విజయం సాధించాడు.
65 కేజీల విభాగంలో వంశజ్ ఫైనల్ చేరినా స్వర్ణం అందుకోలేకపోయాడు. ఉజ్బెకిస్థాన్ బాక్సర్ ఇల్ఖోమ్జోన్ ఎర్గాషెవ్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు. అండర్-19 విభాగంలో ఆదిత్య (55 కేజీలు), శుభమ్ రాజ్పుత్ (90 కేజీలు) కూడా ఫైనల్కు చేరారు. అయితే ఇద్దరూ ఉజ్బెకిస్థాన్ బాక్సర్ల చేతిలో ఓడి రజత పతకాలు గెలిచారు. మొత్తంగా పురుషుల జట్టు రెండు స్వర్ణాలు, మూడు రజత పతకాలతో టోర్నీని ముగించింది. అంతకుముందు మహిళల జట్టు 17 పతకాలు సాధించి భారత బాక్సింగ్ సత్తాను చాటింది.

