కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలోని సారంగాపూర్ మండల కేంద్రానికి చెందిన ఒడ్డే నర్సింలు ఉపాధి నిమిత్తం దుబాయ్కు వెళ్లగా, గత నెల జూన్ 27న అనారోగ్యంతో అక్కడే మృతి చెందాడు. ఈ విషయం కుటుంబ సభ్యులు, మండల బీజేపీ నాయకులు బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. జూన్ 30న విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో పాటు ఎన్ఆర్ఐ సెల్ అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడి, మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం దుబాయ్లోని సంబంధిత అధికారులు మృతికి గల కారణాలపై అవసరమైన ప్రక్రియలు, నివేదికను పూర్తి చేసినట్లు, మృతదేహాన్ని శుక్రవారం భారత్కు పంపిస్తున్నట్లు సమాచారం అందించారు. నర్సింలు మృతదేహం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనుండగా, అక్కడ అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో సహకరించిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

