కలం, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డే అనంతరం భారత యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్పై (Gurnoor Brar) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు లెవల్-1 కింద అధికారిక హెచ్చరిక జారీ చేయడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ను (Demerit Point) నమోదు చేసింది. ఈ ఘటన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో ఎనిమిదో ఓవర్లో చోటుచేసుకుంది. తన బంతిని అందుకున్న గుర్నూర్ బ్రార్ దానిని ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ వైపు విసిరాడు. ఈ చర్యను ఆటగాడి పట్ల తగని, ప్రమాదకర ప్రవర్తనగా మ్యాచ్ అధికారులు పరిగణించారు.
మైదాన అంపైర్లతో పాటు మూడో, నాలుగో అంపైర్లు ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.9 కింద నివేదిక అందించారు. అంతర్జాతీయ మ్యాచ్లో ఆటగాడి వైపు లేదా అతడి సమీపంలో బంతిని అనుచితంగా లేదా ప్రమాదకరంగా విసరడం ఈ నిబంధన పరిధిలోకి వస్తుంది. లెవల్-1 ఉల్లంఘనకు అధికారిక హెచ్చరికతో పాటు మ్యాచ్ ఫీజులో గరిష్ఠంగా 50 శాతం జరిమానా లేదా ఒకటి నుంచి రెండు డీమెరిట్ పాయింట్లు విధించే అవకాశం ఉంటుంది. 24 నెలల వ్యవధిలో ఆటగాడు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు పొందితే అవి సస్పెన్షన్ పాయింట్లుగా మారుతాయి.
రెండు సస్పెన్షన్ పాయింట్లు వచ్చినప్పుడు ఒక టెస్టు లేదా రెండు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ల నిషేధం విధించే అవకాశం ఉంటుంది. డీమెరిట్ పాయింట్లు 24 నెలల తర్వాత ఆటగాడి రికార్డు నుంచి తొలగిపోతాయి. ఐసీసీ వివరాల ప్రకారం, గుర్నూర్ బ్రార్ తన తప్పును అంగీకరించి మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ సూచించిన శిక్షను అంగీకరించాడు. దీంతో అధికారిక విచారణ అవసరం లేకుండానే వ్యవహారం ముగిసింది. అయితే, ఈ క్రమశిక్షణా చర్యల మధ్య కూడా గుర్నూర్ బ్రార్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి వన్డేలో రెండు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించి మూడు వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. ఇరు జట్లు గురువారం కార్డిఫ్లో జరగనున్న రెండో వన్డేలో తలపడనున్నాయి.

