కలం, వెబ్ డెస్క్: ఏపీలో రాజకీయ నాయకులు, మహిళలపై జరుగుతున్న సోషల్ మీడియా వేధింపులు, ట్రోలింగ్పై హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వేధింపులను అరికట్టాలంటే చట్టాల్లో కూడా మార్పులు రావాలని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ఇష్టారీతిన వ్యాఖ్యలు చేసే సంస్కృతిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ప్రజల్లో ఇలాంటి వేధింపులపై అవగాహన రావాలన్నారు. స్వయంగా తాను కూడా ఈ విషయంలో బాధితురాలినేనని చెప్పారు.
రాజకీయ నాయకుల ఇంట్లో వాళ్లను కూడా బయటకు లాగి విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటే ఎలా? అని ప్రశ్నించారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారనేది భయం లేకుండా వ్యవహరిస్తున్నారని చెప్పారు. చట్టాల్లో మార్పులు తీసుకువచ్చేందుకే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
సోషల్ మీడియా బ్యాన్ ఏ వయసు వరకు చేయాలనే దానిపై ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది ఏ వయసు వారికి పరిమితం చేయాలన్న దానిపై వివిధ రాష్ట్రాలు, దేశాలు తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో అబ్యూసివ్ లాంగ్వేజ్ వాడే వారికి ఎలాంటి సెక్షన్లలో శిక్షలు వేయవచ్చనే దానిపై వివరాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. రాబోయే కాలంలో సోషల్ మీడియాలో కనీసం మనిషిని మనిషి గౌరవించుకునేలా మార్పులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

