కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కూల్చివేత గురించి ఆందోళనలో ఉన్న పాతబస్తీ వాసులకు హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ (Ranganath) ఊరట కల్పించారు. ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా బాధితులతో మాట్లాడి వారి ఆందోళనను శాంతింపజేశారు. హైడ్రా ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న పేదల ఇళ్లను కూల్చదని రంగనాథ్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విధానం కూడా ఇదేనని స్పష్టం చేశారు. ప్రజలు కూల్చివేతలపై వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని సూచించారు.
ఖైరతాబాద్, రాజ్భవన్ ఎదురుగా హుస్సేన్సాగర్కు ఆనుకుని నిర్మాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రంగనాథ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధానం కూడా ఇదేనని చెప్పారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా హైడ్రా పేదల ఇళ్లను తొలగిస్తుందని ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ మండిపడ్డారు. కబ్జాదారులు పేదలను తప్పుదోవ పట్టించి తమ స్వార్థానికి వాడుకుంటున్నారని విమర్శించారు. ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా వాసులకు హైడ్రా నోటీసులు ఇస్తుందన్నది పచ్చి అబద్దమన్నారు.

