కలం, వెబ్ డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంకును నిండా ముంచేసి లండన్ పారిపోయిన నీరవ్ మోదీకి (Nirav Modi) భారీ షాక్ తగిలింది. కొంతకాలంగా అతడిని భారత్ తీసుకొచ్చేందుకు తెస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి.
యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో నీరవ్ మోదీ దాఖలు చేసుకున్న చివరి పిటిషన్ను కోర్ట్ కొట్టేసింది. భారత్లో జైళ్ల భద్రత, వసతులు బాగున్నాయని అభిప్రాయపడింది. దీంతో త్వరలోనే ఆయన్ను ఇండియాకు తీసుకురాబోతున్నారు.
సీబీఐ, ఈడీ వరుస ప్రయత్నాలతో..
నీరవ్ మోదీపై మొదట సీబీఐ, ఆ తరువాత ఈడీ మనీలాండరింగ్ కేసు పెట్టి దర్యాప్తు ప్రారంభించింది. అప్పటికే లండన్ పారిపోయిన నీరవ్ మోదీని తమకు అప్పగించాలని పలుమార్లు దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తూ వచ్చాయి.
2019లో అప్పటి బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్ నీరవ్ మోదీని అప్పగించే ఫైల్పై సంతకాలు చేశారు. దీంతో వెంటనే నీరవ్ మోదీ కోర్టులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే లండన్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి వాండ్స్వర్త్ జైలుకు తరలించారు.
అక్కడే ఉండిపోవాలని ప్లాన్..
తనను భారత్కు పంపిస్తే, అక్కడి జైళ్లల్లో చిత్రహింసలు పెడుతారని.. వసతులు కూడా ఏమాత్రం బాగుండవని నీరవ్ మోదీ కోర్టులో పిటిషన్ వేశాడు. వీలైనన్ని సంవత్సరాలు న్యాయ ప్రక్రియను సాగదీస్తూ అక్కడే ఉండాలని నీరవ్ ప్లాన్ చేశాడు.
అయితే, కోర్టులు అతడి వాదనలను పరిగణనలోకి తీసుకోలేదు. చివరికి, యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ను సంప్రదించగా.. అక్కడా చుక్కెదురైంది. త్వరలోనే, లండన్ పోలీసులు సీబీఐ, ఈడీ అధికారులకు నీరవ్ మోదీని అప్పగించే అవకాశం ఉంది.
రూ.13 వేల కోట్లు ఎగ్గొట్టి..
వజ్రాల వ్యాపారం నిర్వహించే నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకులో సుమారు రూ.13 వేల కోట్లు అప్పులు తీసుకున్నాడు. ఇంత భారీగా రుణాలు ఇవ్వడంలో బ్యాంక్ అధికారుల పాత్ర కూడా ఉందని తరువాత దర్యాప్తులో తేలింది.
అతడికి సంబంధించిన లావాదేవీలను ఎక్కడా నమోదు కాకుండా జాగ్రత్త పడ్డారు. 2018 ప్రారంభంలో జరిపిన ఆడిట్లో నీరవ్ మోదీ నిర్వాకం బయటపడింది. ఈ విషయం తెలియగానే.. రాత్రికి రాత్రే లండన్ పారిపోయాడు. ఇది అప్పట్లో రాజకీయంగా కూడా ప్రకంపనలు రేపింది.

