కలం, హనుమకొండ: హనుమకొండ (Hanumakonda) లో ఓ వ్యక్తి వినూత్నంగా తన నిరసనను వ్యక్తం చేశాడు. పోలీసు శాఖలో అవినీతి నశించాలని డిమాండ్ చేస్తూ దుగ్గొండి మండలానికి చెందిన సురేందర్ సోమవారం హనుమకొండ అంబేద్కర్ విగ్రహం కూడలి వద్ద వినూత్నంగా నిరసన చేపట్టారు. చేతిలో ప్లకార్డు పట్టుకుని పోర్లు దండాలు పెడుతూ “పోలీసుల అవినీతి నశించాలి”, “న్యాయం చేయాలి” అంటూ నినాదాలు చేశారు.
పోలీసు వ్యవస్థలో అవినీతి కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫిర్యాదులు చేసినా న్యాయం జరగడం లేదని ఆయన ఆరోపించారు. ఈ నిరసన స్థానికుల దృష్టిని ఆకర్షించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సురేందర్ను నచ్చజెప్పి అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో అంబేద్కర్ విగ్రహం కూడలి వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

