కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకల లెక్కింపును గురువారం నిర్వహించారు. ఆలయ (Basara Temple) ఈవో అంజనీదేవి, పర్యవేక్షకులు రంగు రవికిషన్ గౌడ్ సమక్షంలో హుండీ లెక్కింపు చేపట్టారు. గత 49 రోజులుగా భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి కానుకలను లెక్కించగా మొత్తం రూ.1,06,45,359 ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.
అలాగే 78 గ్రాముల మిశ్రమ బంగారం, నాలుగు కిలోల మిశ్రమ వెండి, 17 విదేశీ కరెన్సీ నోట్లు లభించినట్లు తెలిపారు. హుండీ లెక్కింపు సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణ అధికారి గంగా శ్రీనివాస్, దేవస్థాన పర్యవేక్షకులు శివరాజ్, సంజీవరావు, వాగ్దేవి సొసైటీ సభ్యులు, శ్రీ రాజరాజేశ్వర స్వామి సేవా సమితి సభ్యులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.

