ఉస్మానియా డాక్టర్ల సరికొత్త ఘనత.. ఒకే వ్యక్తికి 5 అవయవాల మార్పిడి

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (Osmania Hospital) డాక్టర్లు మరోసారి సరికొత్త చరిత్ర సృష్టించారు. దేశంలోనే తొలిసారిగా ఒకేసారి ఒకే పేషెంట్‌కు ఐదు అవయవాలను విజయవంతంగా మార్పిడి చేశారు. సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజినీర్‌కు శస్త్రచికిత్సను నిర్వహించారు. సుమారు 36 గంటలపాటు నిరంతరాయంగా కొనసాగింది. ఈ సుదీర్ఘ ఆపరేషన్‌లో రోగికి కడుపు, డ్యూడినమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, పెద్దపేగు అవయవాలను ఒకేసారి విజయవంతంగా అమర్చారు.

ఉస్మానియా (Osmania Hospital) వైద్య బృందం సాధించిన విజయంపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే కఠిన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగ ప్రతిష్ఠను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిందన్నారు. రోగి ప్రాణాలను కాపాడేందుకు అంకితభావంతో పనిచేసిన వైద్యులు, అనస్థీషియా, నర్సింగ్, క్రిటికల్ కేర్, ఇతర సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో అత్యాధునిక, ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయనడానికి ఉస్మానియా వైద్యుల ఘనతే నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ వైద్యరంగాన్ని మరింత బలోపేతం చేస్తూ మరిన్ని సౌకర్యాలను కల్పిస్తుందని పేర్కొన్నారు.

ఒకేసారి 5 అవయవాలు మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన ఉస్మానియా డాక్టర్ల బృందానికి ప్రశంసలు అందుతున్నాయి. ఈ మేరకు నేషనల్ ఆర్గాన్స్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ (NOTTO) ప్రత్యేకంగా అభినందించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>